US-ఇజ్రాయెల్ vs ఇరాన్ యుద్ధం లైవ్ న్యూస్ అప్డేట్స్:
శనివారం తెల్లవారుజామున ఒక క్షిపణి బగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయ భవనాన్ని తాకిన తర్వాత, అక్కడి అమెరికా ఎంబసీ అమెరికా పౌరులు వెంటనే ఇరాక్ను విడిచిపోవాలని సూచించింది. ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక జారీ చేయబడింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలను కీలకమైన చమురు రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) రక్షించడంలో సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఇంధన వ్యాపారానికి ఈ జలసంధి చాలా ముఖ్యమైనది. ప్రతి రోజు సుమారు 2 కోట్ల బారెల్స్ చమురు ఈ మార్గం ద్వారా రవాణా అవుతుంది, ఇది ప్రపంచ వినియోగంలో దాదాపు ఐదో వంతు.
ఇదిలా ఉండగా అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులను కొనసాగిస్తున్నాయి, ఇరాన్లోని మధ్య ప్రాంతమైన ఇస్ఫహాన్ ప్రావిన్స్ లో అనేక ప్రాంతాలపై క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కనీసం 15 మంది మరణించారు.
ట్రంప్ మాట్లాడుతూ, హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు పొందుతున్న దేశాలు ఆ మార్గాన్ని భద్రపరచాలని, “ప్రపంచంలోని దేశాలు హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు పొందుతున్నాయి కాబట్టి ఆ మార్గాన్ని కాపాడుకోవాలి, మేము కూడా సహాయం చేస్తాం” అని చెప్పారు. అలాగే, ఇరాన్ షరతులు అంగీకరించకపోతే ఖార్గ్ దీవిపై (Kharg Island) అమెరికా మరికొన్ని దాడులు చేయవచ్చని కూడా హెచ్చరించారు.
ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మాట్లాడుతూ, హోర్ముజ్ జలసంధి తమ శత్రువులకు మూసివేయబడిందని పేర్కొన్నారు.
ఈ ఘర్షణల కారణంగా మధ్యప్రాచ్యం మొత్తం ఉద్రిక్తతల్లో చిక్కుకుంది. యుఎఇలోని ఫుజైరా పోర్ట్పై డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. బగ్దాద్లోని అమెరికా ఎంబసీ ప్రాంగణంలోని హెలిప్యాడ్పై క్షిపణి దాడి జరగగా, యుఎఇలోని ఒక చమురు కేంద్రంలో అడ్డుకున్న డ్రోన్ అవశేషాలు పడిపోవడంతో అగ్నిప్రమాదం సంభవించింది.
ఇక అమెరికా రక్షణ శాఖ (Pentagon) ప్రాంతంలో తన సైనిక ఉనికిని పెంచుతోంది. అదనంగా 2,500 మంది మెరైన్లు మరియు అంబిఫిబియస్ అసాల్ట్ షిప్ USS Tripoli ను మధ్యప్రాచ్యానికి పంపుతున్నారు. ఇది గత ఎన్నో దశాబ్దాల్లో అమెరికా చేపట్టిన అత్యంత పెద్ద నౌకాదళ సమీకరణల్లో ఒకటిగా భావిస్తున్నారు.